వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌లో గెలిచి ఈటలను ఇంటికి పంపిస్తా: కౌశిక్‌రెడ్డి

  • శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా కౌశిక్‌రెడ్డి
  • కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ
  • హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ జెండాను ఎగరవేస్తానని ధీమా
  • బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరైన పలువురు మంత్రులు
టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి నిన్న తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు విప్‌గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటానని అన్నారు.

తనకు సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ తన పేరును ప్రకటించారని, అక్కడ విజయం సాధించి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తానని, ఈటలను ఇంటికి పంపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా, విప్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గత రాత్రి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కౌశిక్‌రెడ్డి కలిశారు.

BRS
Padi Kaushik Reddy
KTR
KCR

More Telugu News